అమీర్పేట్, అక్టోబర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బండారు జగపతి ఎంపికయ్యారు. అనంతరం గురువారం అమీర్పేట్ హనుమాన్ దేవాలయ ఆవరణలో అధ్యక్షుడు బండారు జగపతి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అర్చక సంఘం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కాండూరి కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, ఉపాధ్యక్షుడు రాజేశ్వర శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడిగా పెద్దమ్మ తల్లి దేవాలయ అర్చకులు పొర్నంది నాగరాజును, ప్రధాన కార్యదర్శిగా బంజారాహిల్స్ దేవాలయం అర్చకులు రాయప్రోలు మల్లికార్జున శర్మను, ఉపాధ్యక్షుడిగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అర్చకులు అనిల్ గౌడ్ను నియమించారు. ఈ సందర్భంగా జేఏసీ అర్చక విభాగం రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న ప్రతినిధులు తమ పరిధిలోని సమస్యలను తెలుసుకునేందుకు ఉద్యోగులు, అర్చకులను నేరుగా కలిసి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు.