న్యూఢిల్లీ: అరేబియా సముద్రం నుంచి తీరానికి దూసుకొస్తున్న తౌక్టే తుఫాను ప్రభావం తీర ప్రాంతాల్లో మొదలైంది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే తుఫాను సృస్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుఫానుకు ఒక పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు ఈ తుఫాన్కు తౌటే అని పేరు పెట్టారు.
అసలు ఈ తౌటే అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా..? బర్మా (మయన్మార్) భాషలో తౌటే (Tauktae) అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థమట. 2021లో ఏర్పడ్డ ఈ తొలి తుఫాన్కు పేరు పెట్టే అవకాశం మయన్మార్కు లభించింది. దాంతో మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును ఈ తుఫానుకు పెట్టింది. సాధారణంగా ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఈ ప్రాంతంలోని దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది.
ఈ నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.