కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా గర్భిణులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. డెలివరీ సమయం దగ్గర పడుతున్న సందర్భంలో దవాఖానలకు వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా వైద్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. డెలివరీ కోసం వచ్చిన వారిలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే కొవిడ్ ప్రత్యేక విభాగాలు ఉన్న దవాఖానల్లోనే డెలివరీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. గర్భిణులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, దీంతో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. అయితే నెలలు నిండిన వారు కేవలం తమను కాపాడుకోవడమే కాకుండా కడుపులో ఉన్న శిశువును రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యంగా, నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే ఇల్లువదిలి బయటకు రావొద్దని సూచించారు.