కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తూ రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత లేకుండా చూస్తున్నది. తరచూ వానలు కురుస్తున్న ఈ సమయంలో దవాఖానల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలిగినా.. తీవ్ర ఇక్కట్లు తప్పవు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ దవాఖానల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఒక్కో దవాఖానకు ముగ్గురు విద్యుత్ నిపుణులను ఇన్చార్జీలుగా నియమించి ఒక్కక్షణం కూడా అంతరాయం కలుగకుండా చూస్తున్నారు.
సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత తరుణంలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో.. దాన్ని నిరంతరాయంగా సరఫరా చేయాలంటే విద్యుత్ కూడా అంతే అవసరం. ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవరోధాలు లేకపోయినా.. ఆ శాఖ అధికారులు మాత్రం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని గాంధీ, కింగ్కోఠి, ఫీవర్ దవాఖానల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ రెడ్డి, సర్కిల్ ఎస్ఈ, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కలిసి ఆయా వార్డులకు విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి లోపం లేకుండా, అంతరాయం కలకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్కో దవాఖానలో ఒక ఏఈతోపాటు మరో ఇద్దరు నిపుణులు ఉండేలా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. వీరంతా 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దవాఖానల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా వీరు చర్యలు తీసుకుంటున్నారు.
అకాల వర్షాలతో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడా అంతరాయం తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం మా బాధ్యత. నగరంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ, కింగ్ కోఠి, ఫీవర్ దవాఖానలను ఆయా సర్కిల్ ఉన్నతాధికారులైన ఎస్ఈ, డీఈ, ఏడీఈలతో కలిసి పరిశీలించాం. విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మార్పులు చేసుకోవాలని సూచించాం. ఇందుకోసం ప్రతి వైద్యశాలలో ఒక ఏఈ, ఇద్దరు సిబ్బందిని నియమించాం. వారు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ నిరంతరం కొనసాగేలా చూస్తారు. జె.శ్రీనివాస్ రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్