శంషాబాద్ రూరల్ : మండల కేంద్రానికి విసిరేసినట్లుగా ఉండే మారుమూల గ్రామమది. అక్కడ అందరూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నవారే. 1400 మంది నివాసముంటున్న ఈ చిన్న గ్రామంలో పోస్టాఫీసు ఉంది. అయితే ఇక్కడికి కొత్తగా వచ్చిన ఉద్యోగి సునీత గ్రామంలో విస్తృతంగా తిరిగి తపాలా సేవలపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించింది. మొదట్లో ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయినా పట్టువిడవని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి అర్థమయ్యేలా విడమరిచి చెప్పింది. పట్టుబట్టి పొదుపు బాట పట్టేలా చేసింది. మొత్తంగా ఆ గ్రామాన్ని మొదటిస్థానంలో నిలిపింది. తపాలా శాఖ కేంద్ర కార్యాలయం నుంచి ఐదు నక్షత్రాల అవార్డును అందుకుంది.
శంషాబాద్ మండలంలో ఉన్న చివరి గ్రామం నానాజీపూర్. ఈ గ్రామానికి ఆనుకొని ఎంటేరు వాగు ప్రవహిస్తుంది. పక్క గ్రామాలకు వెళ్లాలంటే గ్రామస్తులు వాగు దాటాల్సిందే. మరోవైపు బ్యాంకు సేవల వినియోగానికి సుమారు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నర్కుడ లేదా పాలమాకులకు వెళ్లాల్సిందే. అదే సమయంలో గ్రామంలో ఉన్న తపాలాశాఖకు నూతనంగా వచ్చిన ఉద్యోగి సునీత తపాలా పొదుపు, బీమా, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో గ్రామస్తులు ఆకర్షితులయ్యారు. మొత్తంగా మూడేండ్లలో తపాలా పొదుపు (279), సుకన్య సమృద్ధి యోజన(101), ఇండియన్ పోస్టు పేమేంట్ బ్యాంకు (443), గ్రామీణ తపాలా బీమా(119), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన(178), ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన(43) ఖాతాలను తెరిపించింది. దీంతో ఆమె చేసిన సేవలను తపాలా కేంద్ర కార్యాలయం గుర్తించింది. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ కల్పన ఆధ్వర్యంలో సునీతను సన్మానించారు. ఐదు నక్షత్రాల అవార్డును అందజేశారు.
ఉద్యోగంలో చేరిన మొదట్లో గ్రామంలోని తపాలా కార్యాలయానికి గ్రామస్తులు ఎవరూ రాకపోవడాన్ని గమనించా. ఈ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించి తపాలా సేవలపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నా. ఎక్కువ మంది గ్రామస్తుల జీవనాధారం వ్యవసాయం అయినందున తక్కువ డబ్బులతో పాలసీలు చేయడం ప్రారంభించా. కేవలం మూడు సంవత్సరాల్లో 1,163 పాలసీలు కట్టించి నానాజీపూర్ను తెలంగాణలో మొదటి స్థానంలో నిలిపా. నా సేవలు గుర్తించి తపాలా శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. – సునీత, నానాజీపూర్, తపాలా శాఖ ఉద్యోగి