హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): గతంలో కొవిడ్ చికిత్స అందించిన అన్ని దవాఖానలను తిరిగి పూర్తిస్థాయిలో కేటాయించాలని, 33 జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో కరోనా వార్డులు ఏర్పాటుచేసి చికిత్స అందిచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, మందులు, ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చూడాలని స్పష్టంచేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మంత్రి ఈటల శనివారం బీఆర్కే భవన్లో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావుతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని నేచర్ క్యూర్ దవాఖాన, ఆయుర్వేద, నిజామియా టీబీ, ఫీవర్, చెస్ట్ దవాఖానలను పూర్తిస్థాయిలో కొవిడ్ చికిత్స, క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని, వారంలో సిద్ధంచేయాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేయడానికి ఆధునిక సాంకేంతికతతో రూపొందించిన యాప్ను పూర్తిస్థాయిలో వినియోగించాలని చెప్పారు. తద్వారా పాజిటివ్ వచ్చినవారి కాంటాక్ట్లకు వెంటనే మొబైలు సందేశాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో ట్రేసింగ్ అత్యంత త్వరగా చేయడం సాధ్యమవుతుందని అన్నారు. హోంఐసొలేషన్లో ఉండేవారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎస్ఆర్నగర్లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ పూర్తిస్థాయిలో పని చేయనున్నదని పేర్కొన్నారు. హోంఐసొలేషన్లోనివారికి మెడికల్ కిట్ అందించాలని సూచించారు. కరోనా వైద్యం పేరిట అధిక సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ దవాఖానలను హెచ్చరించారు. 22 దవాఖానలో ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ టాంక్లను ఏర్పాటుచేశామని స్పష్టంచేశారు.
జిల్లా కేంద్రాల్లో ఐసొలేషన్ సెంటర్లు
అన్ని జిల్లా కేంద్రాల్లో మునుపటిలా ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల్లో 24 గంటలు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భోజనం, మంచినీరు అందజేస్తామని అన్నారు. బాధితులను తరలించేందుకు ప్రత్యేక 108 వాహనాలు కేటాయించాలని ఆదేశించారు. కరోనాకు చంపే శక్తి లేదని.. ఎవరయితే నిర్లక్ష్యం చేస్తారో, లక్షణాలు ఉన్నా పరీక్ష చేసుకోకుండా ఆలస్యం చేస్తారో, కరోనా నిర్ధారణ అయిన తరువాత కూడా సరైన చికిత్స తీసుకోరో వారికి మాత్రం ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.