సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జనాభా పెరుగుదల పేదరికానికి కారణమవుతుందని, కుటుంబ నియంత్రణ పాటిస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డా.అమర్సింగ్ నాయక్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని హరిహరా కళాభవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమర్సింగ్ హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని సూచించారు. బాల్య వివాహాల వలన కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతి అవలంభనలో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కుటుంబ నియంత్రణ విధులలో విశేష సేవలు అందజేస్తున్న సర్జన్లకు, నర్సులకు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం అధికారిణి డా.శ్రీదేవి, అదనపు జిల్లా వైద్యాధికారి డా.జయమాలిని, డీడీటీ రాములు, ఎస్.ఓ.ఆనంద్, మాస్ మీడియా అధికారులు పాల్గొన్నారు.