హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాతోపాటు నగరంలో పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సుమారు 1700 పైచిలుకు కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని పరిశ్రమలను రీలొకేట్ చేసేందుకు వివిధ పారిశ్రామికవాడల్లో ఖాళీ స్థలాలు సిద్ధంగా ఉండగా, అదనంగా అవసరమయ్యే భూములను సేకరించేందుకు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో భూములను గుర్తించారు. భూసేకరణ దగ్గర్నుంచి పరిశ్రమల తరలింపు వరకు 33 నెలల కార్యప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల అధికారుల సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పరిశ్రమల తరలింపు కార్యప్రణాళికకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించాలని 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్నుంచి ప్రతిపాదన ఉన్నా తాజాగా జనావాసాల మధ్యనున్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపులో జాప్యం చేయరాదని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా రెడ్ కేటగిరీలో ఉన్న 625 పరిశ్రమలు, ఆరెంజ్ కేటగిరీలోని 1071 పరిశ్రమలను తరలించనున్నారు. రెడ్ కేటగిరీలో ఫార్మా-188, ఇంజినీరింగ్-119, పెయింట్స్-11, మెటల్స్-172, రబ్బర్-2, టెక్స్టైల్-11, కెమికల్స్-121, పేపర్/ప్లాస్టిక్-3, ఫుడ్/బేవరేజెస్-7, ఇతర-41, మొత్తం 675 పరిశ్రమలు ఉండగా, ఆరెంజ్ కేటగిరీలో ఫార్మా-176, ఇంజినీరింగ్-194, పెయింట్స్-47, మెటల్స్-243, రబ్బర్-40, టెక్స్టైల్-1, కెమికల్స్-34, పేపర్/ప్లాస్టిక్-152, ఫుడ్/బేవరేజెస్-80, ఇతర-104, మొత్తం 1071 పరిశ్రమలున్నాయి.
పారిశ్రామికవేత్తలు నష్టపోకుండా ప్రస్తుతం పరిశ్రమ కొనసాగుతున్న ప్లాట్లను వాణిజ్య, నివాస, మల్టీపర్పస్ ఉపయోగం కోసం అనుమతిస్తారు. ప్రస్తుత మార్కెట్ ధరపై 50శాతం చెల్లించి ప్లాట్లలో 10శాతాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తారు. ఇతర అవసరాల్లో భాగంగా ఐటీ, నివాస ప్రాంతాలుగా ఉపయోగించుకోవచ్చు. మార్కెట్ ధరలో 40 శాతం మొత్తాన్ని కన్వర్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ ఇలా..మొత్తం నాలుగు శ్రేణుల్లో 5290 పరిశ్రమలు ఉండగా, ప్రధానంగా రెడ్,ఆరెంజ్ కేటగిరీల్లోని 1746 పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలు 7 వేల ఎకరాల్లో విస్తరించి ఉండగా, వీటిని రీలొకేట్ చేసేందుకు 10 వేల ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతానికి టీఎస్ఐఐసీకి చెందిన వివిధ పారిశ్రామికవాడల్లో రీలొకేషన్ కోసం కొన్ని ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బిచినేపల్లి పారిశ్రామికవాడలో ఆయిల్మిల్లుల కోసం 191.91 ఎకరాలు (62ప్లాట్లు), సంగారెడ్డిలోని ఇంద్రకరణ్లో టెక్స్టైల్ పరిశ్రమలకు 165.98 ఎకరాలు (20ప్లా ట్లు), పూడూరులోని రాకమచర్లలో స్టీల్ రోలింగ్ పరిశ్రమలకు 112.48ఎకరాలు (44ప్లాట్లు), ముచ్చర్ల ఫార్మాసిటీలో ఫార్మా కంపెనీలకు 19 వేల ఎకరాలు (479 యూనిట్లు), బండతిమ్మాపూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 122 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి.
వీటితోపాటు మెదక్ జిల్లా చండూరు, పోతంశెట్టిపల్లె, సలబాత్పూర్, రాంపూర్, కొట్టాలా, అన్నా రం, బి.కొండాపూర్, సంగారెడ్డిలోని లక్డారం, దిగ్వా ల్, నవాబ్పేట, వికారాబాద్లోని అర్కటాల, ఎక్మామిడి, గుడుపల్లె, గిర్గిట్పల్లె, రంగారెడ్డిలోని చెగు రు, సిద్ధాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భూములను గుర్తించారు. అవసరమైతే మరో 20 ప్రాంతా ల్లో కూడా కొత్తగా భూసేకరణ జరిపేందుకు వీలుందని కార్యప్రణాళికలో ప్రతిపాదనలు రూపొందించారు.
ప్రధానంగా నివాస ప్రాంతాలు, జలాశయాలు, అడవులు తదితర వాటికి దూరంగా ఉన్న భూములనే పరిశ్రమల కోసం ఎంపిక చేస్తారు. భూసేకరణ అనంతరం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ హియరింగ్ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. మంత్రి ఆదేశాలకనుగుణంగా పరిశ్రమల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.