సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ)/దోమలగూడ : లాక్డౌన్ ఆంక్షల అమలు కఠినంగా అమలు చేస్తూనే నగర పోలీసులు తమ శారీరక ఆరోగ్యంపై దృష్టి పెంచారు. వ్యాయామానికి తగిన సమయం దొరక్కపోయినా.. విధుల్లో భాగంగానే వీలైనప్పుడల్లా నడుస్తూ రోజువారీ వ్యాయామాన్ని పూర్తి చేస్తున్నారు. నగర పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నాలుగు నెలల కిందట ఓ ఆలోచన చేసి ప్రతి అధికారి నిత్యం ఏడు వేల నుంచి పదివేల అడుగులు తప్పనిసరిగా వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాము వేసిన అడుగులను సెల్ఫోన్లోని యాప్లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని చెప్పారు. దీంతో ప్రతి అధికారి నడకకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు అధికారులైతే తమ వాహనాలను వాడకుండా నడుచుకుంటూనే తమ ఇండ్లు, కార్యాలయాలకు వెళ్తున్నారు. అత్యవవసరమైతేనే వాహనాలు వినియోగిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొక అధికారి పోటీ పడుతూ అడుగులు వేస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఏసీపీ స్థాయి వరకు ఈ పోటీలో పాలుపంచుకుంటున్నారు.
ప్రస్తుతం పోలీసులు లాక్డౌన్ నిబంధనల అమలుపై దృష్టి పెట్టారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని నిలువరించడం.. ఉల్లంఘన దారులపై కేసులు రాస్తున్నారు. పై అధికారులకు రిపోర్టు చేస్తున్నారు. ఇదే సమయంలోనూ పోలీసులు తమ వాహనాలను పక్కన బెట్టి నడుచుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. నడకకు సంబంధించిన టార్గెట్ను పూర్తి చేస్తున్నారు. మరికొందరు అధికారులైతే విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు.
వ్యాయామంతో శారీరక, మానసిక దృఢత్వం పెరగుతున్నది. దీంతో పాటు రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న పోలీసులు దృఢంగా మారుతున్నారు. ప్రతిరోజు పదివేల అడుగులంటే ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడుస్తున్నారు. కొందరు అధికారులైతే ఏకంగా పది నుంచి ఇరవై వేల అడుగులూ వేస్తున్నారు. విధి నిర్వహణలో నడకను భాగం చేసుకుంటున్నారు.
ఇందిరాపార్కు వద్ద విధుల నిర్వహిస్తున్న సమయంలో పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారి కలిశారు. ఆయన రోజూ చేస్తున్న వ్యాయాయంతో చురుగ్గా కనిపించారు. ఇప్పటికే సీపీ ఆదేశాలతో ప్రతిరోజు పదివేల అడుగులు వేస్తున్నా. రిటైర్డ్ అధికారి కలిసిన తర్వాత వ్యాయామాన్ని మరింత పెంచాలనుకున్నా. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో నడుచుకుంటూనే విధుల నిర్వహణపై దృష్టి పెట్టా. ఉదయం కుదరని రోజు సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. ప్రతి రోజు పదిహేను కిలోమీటర్లు నడవాలన్నదే నా టార్గెట్. నన్ను చూసి చిక్కడపల్లి డివిజన్లోని చాలా మంది అధికారులు రోజూ నడుస్తున్నారు.-చల్లా శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీ
విధి నిర్వహణలో నడకను ఓ భాగం చేసుకున్నా. ఎంత ఒత్తిడి ఉన్నా నడవడం మాత్రం మరువను. లాక్డౌన్ సమయంలో కొద్ది కొద్దిగా నడుస్తూ సాయంత్రం వరకు టార్గెట్ను పూర్తి చేస్తున్నా. ఆరోగ్యంగా ఉంటేనే విధి నిర్వహణలో ఉత్సాహం పెరుగుతుంది. సీపీ ఆదేశాల మేరకు సిబ్బంది పోటీ పడి నడుస్తున్నారు. కొందరైతే తెల్లవారు జామునే లేచి వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు వారికి ఉన్న ఖాళీ సమయాల్లో నడుస్తున్నారు. -సుదర్శన్, ఏసీపీ బంజారాహిల్స్
చాంద్రాయణగుట్ట,మే 19: లాక్డౌన్ పటిష్ట అమలు కోసం ఛత్రినాక పోలీసులు వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీతో పాటు ఇతర సిబ్బంది వినూత్నంగా సైకిళ్లపై తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. నిబంధనలు పట్టించుకోని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేకాక మాస్కులు ధరించని.. భౌతిక దూరం పాటించని వారిని గుర్తిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఛత్రినాక పరిధిలోని ప్రధాన రోడ్లపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చిన్నచిన్న గల్లీల్లో సైతం పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ కాస్తుండటంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.