సిటీబ్యూరో, అగస్టు 27 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రభుత్వ చర్యలతో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు ఎంతో మెరుగుపడింది. ఫ్రెండ్లీ పోలీసింగ్తో భాధితులకు సత్వర న్యాయం అందుతున్నది. ముఖ్యంగా నూతనంగా ఎంపికైన పోలీస్ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బాధితులతో ఎలా వ్యవహరించాలి. సత్వర న్యాయం ఎలా అందించాలన్న దానిపై ఆ తరగతుల్లో వివరిస్తున్నారు.
“పోలీస్ వృత్తిలోకి వచ్చారు.. ఇక్కడ ఉద్యోగులందరూ సమానమే. లింగ బేధాలు ఉండవు. ప్రజా సంరక్షణ కోసం అందరూ కలిసి పని చేయాలి. ఆదర్శంగా ఉంటూ క్రమశిక్షణతో పని చేయాలి. ఈ వృత్తిలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం శ్రమించాలి. నిబద్ధతతో ఉంటూ బాధితుల్లో నమ్మకం పెంచాలి” అని శిక్షణ తరగతుల్లో సిబ్బందికి అవగాహన కల్పించారు.
“ సార్ నా భర్త తాగి కొడుతున్నాడు. పిల్లలనూచితకబాదుతున్నాడు.” అంటూ బాధితురాలు ఫిర్యాదు చేస్తే భర్తనే కదమ్మా.. ఆయన మీద కేసంటే ఎలా..? పోయి భర్తతో కలిసి ఉండు.. ఇది ఒకప్పటి పోలీస్ ైస్టెల్ నీవేం భయపడకమ్మా..ఎన్నో చట్టాలున్నాయి.. అవి నిన్ను కాపాడుతాయి. నీకు పూర్తి భద్రత కల్పించే బాధ్యత మాదే..ఇది ప్రస్తుత ఫ్రెండ్లీ పోలీసింగ్లోని మార్పు..
ఇటీవల కొత్తగా పోలీస్ శాఖలో చేరిన 544 మంది కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాయి. వృత్తిలో పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నాయి. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 11 దశల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులు నూతన కానిస్టేబుళ్లకు ఎంతగానో దోహదపడ్డాయి. ఓ పోలీస్ అధికారిగా సామాన్యుడికి ఎలా న్యాయం చేయవచ్చో తెలుసుకోవడంతో పాటు స్టేషన్కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించే ప్రక్రియకు ఇప్పుడు పోలీసులు శ్రీకారం చుట్టారు.