బంజారాహిల్స్, జూలై 19: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. అవకాశం చిక్కినప్పుడల్లా కూతురు భోజనంలో నిద్రమాత్రలు కలుపడం.. ఆమె నిద్రమత్తులోకి వెళ్లడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం గ్రహించిన తల్లి అనుమానంతో కూతుర్ని ప్రశ్నించగా తండ్రి చేసిన దురాగతాన్ని బయటపెట్టింది. విషయం బయటకు పొక్కడంతో తండ్రి పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కామాంధుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన వెంకటరమణ భార్యాపిల్లలతో కలిసి ఏడాది కిందట బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి, జూబ్లీహిల్స్లోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
అతడి భార్య ఇండ్లల్లో పనిచేస్తుంది. కాగా, వీరికి ఒక కొడుకు, కుమార్తె(16) ఉన్నారు. ఈ మధ్య కాలంలో వెంకటరమణ మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకూతురు భోజనంలో నిద్రమాత్రలు కలిపి.. ఆమె నిద్రపోయిన తర్వాత లైంగికదాడికి పాల్పడుతున్నాడు. రాత్రి సమయంలో కూడా నిద్రలో ఉన్న కూతురుపై ఇదే విధంగా వ్యవహరించాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. తల్లికి అనుమానం వచ్చి ప్రశ్నించగా తండ్రి చేసిన దురాగతాలను కూతురు వివరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించినట్లు కూడా తెలిపింది. బాధితురాలి తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కూతురికి అబార్షన్ చేయించింది. విషయం బయటపడటంతో వెంకటరమణ పరారయ్యా డు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు వెంకటరమణపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.