సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ టీకా మొన్నటి వరకు కేవలం ప్రైవేటులోనే అందుబాటులో ఉండేది. ఈ టీకా మూడు డోసులు కలిపి సుమారు రూ.12 వేలు ఉండటంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలకు ఈ టీకా వేయించేందుకు ఇబ్బందులు పడేవారు. ఇది గమనించిన ప్రభుత్వం ఖరీదైన న్యూమోకోకల్ టీకాను పూర్తిగా ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. బుధవారం గ్రేటర్ పరిధిలోని 154 ఆరోగ్య కేంద్రాలలో న్యూమోకోకల్ టీకాను ప్రారంభించారు. రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలో 500 మందికి, హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 1000 మందికి, మేడ్చల్ పరిధిలో సుమారు 300 మంది చిన్నారులకు న్యూమోకోకల్ టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.