సుల్తాన్బజార్,ఆగస్టు 17: చిన్నారులు న్యూమోనియా బారిన పడకుండా న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) దోహదం చేస్తుందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి అన్ని యూపీహెచ్సీలు, డిస్పెన్సరీల్లో ఏడాదిలోపు చిన్నారులందరికీ పీసీవీ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మొదటిసారిగా ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఇసామియాబజార్, సుల్తాన్బజార్, బొగ్గులకుంటలోని యూపీహెచ్సీలలో పీసీవీ టీకాపై అవగాహన కరపత్రాలను డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ పద్మజ ఆవిష్కరించారు. బుధవారం నుంచి అన్ని యూపీహెచ్సీలలో పీసీవీ టీకాలను ప్రారంభిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఇసామియాబజార్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పెరుమల్ల చందన, సుల్తాన్బజార్ యూపీహెచ్సీ పీహెచ్ఎన్ రామలక్ష్మి, నాగమణి, రమాదేవి, మాధవి, లలిత, మరియమ్మ, సుధారాణి పాల్గొన్నారు.
శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో వాపు రావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం, తినడానికి, తాగడానికి కష్ట్టంగా మారి అపస్మారక స్థితిలోకి చేరి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. న్యూమోకోకల్ అనే బ్యాక్టీరియా నుంచి న్యూమోనియా వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స ఉంది. ఈ వ్యాధిని నివారించేందుకు మిషన్ ఇంద్ర ధనుష్లో భాగంగా న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) టీకాను ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
ఏడాది లోపు చిన్నారులు న్యూమోనియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పీసీవీ టీకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏడాదిలోపు పిల్లలకు మూడు మోతాదుల్లో టీకాలను అందిస్తామని తెలిపారు. శిశువు పుట్టిన సమయం నుంచి 6 వారాలు, 14 వారాల సమయంలో పీసీవీ టీకాలు ఇచ్చి, 9 నెలల శిశువుకు బూస్టర్ టీకాను ఇస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 17 ( నమస్తే తెలంగాణ ) : న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి కొనసాగుతుందని, అవసరమున్న తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఇప్పించాలని కలెక్టర్ శర్మణ్ చెప్పారు. ఆరు వారాల వయస్సున్న పిల్లలకు మొదటి డోసు, 14 వారాలకు రెండో డోసు, 9 నెలలకు 3వ డోసు ఇప్పించాలని సూచించారు. ఇన్ని రోజులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ను అందరికీ అందేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు. కొవిడ్ మూడో దశ పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు తప్పనిసరిగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ వ్యాక్సిన్తో న్యూమోనియా, సెఫ్టిసేమియా, ఐర్థెంటిస్, సైనోసైటిస్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆరు వారాలు నిండిన పిల్లలందరికీ బుధ, శనివారాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.