సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట బల్దియాపై మరోమారు గులాబీ జెండా ఎగిరింది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గాను టీఆర్ఎస్ పార్టీ 36 గెలుచుకున్నది. బీజేపీ 1, స్వతంత్రు లు 5, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేయగా, బీజేపీ 40 స్థానాల్లో పోటీచేసి కేవలం ఒక్క స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో పోటీచేసి ఒక్కసీటు గెలుచుకోకపోవడంతో పాటు నామమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. కాగా, టీఆర్ఎస్ 36 వార్డులు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన ఆ పార్టీ రెబల్స్ ఐదుగురు గెలుపొందారు. వారు టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాంతో టీఆర్ఎస్ బలం 41కు చేరుకుంటుంది. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ పూర్తిచేశారు. మధ్యాహ్నం వరకు తొలి రౌండ్ ఫలితాలు రాగా, సాయంత్రం 6.30 తర్వాత చివరి ఫలితాలు వచ్చాయి.