అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. సమాజానికి మాత్రం తమ వల్ల ఎంతో కొంత మేలు జరిగితే అదే తమకు ఆనందమని భావించారు. కరోనా విసిరిన పంజాకు తాము చవిచూసిన కష్టాలు మరొకరికి రావొద్దని తలిచారు. అందుకే తమ ఉద్యోగాలు చేసుకుంటూనే.. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో వలంటీర్లుగా చేరి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకున్నారు. గత ఏడాది సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన కొవిడ్ ప్రత్యేక హెల్ప్లైన్ కేంద్రంలో సేవలు ప్రారంభించారు. వైరస్ సోకిన వారి క్షేమ సమాచారాలు కనుక్కోవడం, కోలుకున్న వారిని ప్లాస్మా ఇచ్చేలా ప్రోత్సహించడం, వారి సందేహాలు తీర్చడం, ప్లాస్మా అవసరమైన వారికి వెంట వెంటనే సమాచారం ఇచ్చి దాతలతో సమన్వయపరచడం వంటి పనులు చేస్తున్నారు. ఇలా ఇప్పటికి 13 వేల మంది కుటుంబాలకు తోడ్పడ్డారు. అటువంటి స్వచ్ఛంద సేవకులపై కథనం.
మా ఆంటీకి బీ నెగెటివ్ గ్రూపు రక్తం కావాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాం. ఆ సందర్భం నాకు పెద్ద అనుభవం. ఆ కష్టం చూసి నేను కూడా ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 12 సార్లు ప్లేటెలెట్స్ను, 20 సార్లు రక్తాన్ని దానం చేశాను. ఇప్పుడు కొవిడ్ సెంటర్ ద్వారా.. రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అవసరమైన వారికి దాతలను సంప్రదించి సమన్వయ పరుస్తున్నాం. మనం ముందుకొస్తే.. మనలాగే ఇంకొకరు మరొకరి కోసం ముందుకొస్తారు కదా. ఎంతైనా..సాయం చేయడం చాలా మంచి పని కదా – వివేక్, ట్రిపుల్ ఐటీ ఉద్యోగి
కొవిడ్ మహమ్మారి కాలంలో కొంతమంది పౌరులు నిరంతర సేవలు అందిస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో 55 మంది వలంటీర్లు ఒక వైపు ఉద్యోగం, మరోవైపు చదువుకుంటూ.. ఇంకోవైపు కరోనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్లాస్మా అందేలా కృషి చేస్తున్నారు. అలాగే కరోనా విజేతలకు కౌన్సెలింగ్ ఇస్తూ.. ప్లాస్మాకు ముందుకు వచ్చేలా చేస్తున్నారు. కరోనా సెకండ్వేవ్లో వారి సేవలు రెట్టింపు అయ్యాయి. సేవకు ఆర్థిక మద్దతు లేకపోయినా.. ఉద్యోగాలకు, చదువులకు అంతరాయం కలుగకుండా.. సమయాన్ని విభజించుకుని.. ఇప్పటివరకు దాదాపు 13 వేల మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు.
నేను బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. చిన్నప్పటి నుంచి సేవచేసి.. పలువురికి ఉపయోగపడాలనే కోరిక ఉండేది. అందుకే ఎస్సీఎస్సీలో వలంటీరుగా చేరాను. ఈ సేవ.. నా చదువుకు అడ్డంకిగాకుండా సమయాన్ని విభజించుకుని ఒక వైపు ప్లాస్మా దానం కోసం కౌన్సెలింగ్ చేస్తూ … అవసరం ఉన్న వారికి దాతను అందించే ప్రయత్నాలు చేస్తున్నా. ఇలా సేవను పొందినవారు.. కోలుకున్న తర్వాత వారు చెప్పే కృతజ్ఞతలు అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి మా కళాశాల యాజమాన్యం కూడా సహకరించడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కరోనా కాలంలోనూ బాధితులకు సేవలందిస్తున్నా. – సంధ్య, విద్యార్థిని, జి.నారాయణమ్మ కళాశాల
వలంటీరుగా పని చేయడం చాలా ఇష్టం. దీని కోసమే ఒకవైపు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. మరో వైపు ఎస్సీఎస్సీ వలంటీరుగా గత నాలుగు ఏండ్లుగా సేవలు అందిస్తున్నా. అనేక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నా. తాజాగా ఇప్పుడు కొవిడ్ సమయంలో పని చేస్తున్నా. వెబ్సైట్, ఫోన్ కాల్స్ను విశ్లేషించి… డోనర్స్ను అవసరం ఉన్న వారికి అందిస్తుంటాను. ప్రస్తుతం రెండో దశలో చాలా మంది భయపడుతుండటంతో డోనర్స్ తక్కువగా ఉంటున్నారు. అవసరం ఉన్నవారు అధికంగా నమోదవుతున్నారు. – రాజశేఖర్రెడ్డి, ప్రైవేటు ఉద్యోగి