ఆర్కేపురం, జూలై 12: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వర్గీకరణ లక్ష్యంతో ఈ నెల 26, 27 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మాదిగ యూత్ జేఏసీ నాయకులు పిడమర్తి రవిని సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మాదిగలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర నిరసన దీక్ష, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడుతామని, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిన మోడీ ప్రభుత్వానికి మాదిగలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. మాదిగ మేధావులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై ‘చల్లో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాదిగ యూత్ జేఏసీ అధ్యక్షుడు నక్క శరత్ కుమార్ ఉన్నారు.