రవీంద్రభారతి, సెప్టెంబర్ 6 : కరోనా క్లిష్ట సమయంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన ఫొటో జర్నలిస్టే నిజమైన బాహుబలి అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కరోనా అందరినీ ఆపింది… కానీ కాలాన్ని, ఫొటోను ఆపలేకపోయిందన్నారు. ఈనాడు మాజీ చీఫ్ ఫొటో ఎడిటర్ కేశవులు, ది హిందూ మాజీ చీఫ్ సతీశ్ జడ్జీలుగా వ్యవహరించి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. నమస్తే తెలంగాణ నుంచి సీనియర్ ఫొటోగ్రాఫర్ గడసంతల శ్రీనివాస్, మహబూబ్నగర్ జిల్లా ఫొటో జర్నలిస్టు బందగి గోపీకి కన్సోలేషన్ బహుమతులను మామిడి హరికృష్ణ, సుచిరిండియా సీఈవో కిరణ్ అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ ధర్మాన, ప్రధాన కార్యదర్శి వీరోగోని రజినీకాంత్గౌడ్, ఉపాధ్యక్షుడు సురేశ్కుమార్, సభ్యులు అనిల్, శివకుమార్, దీపక్దేశ్పాండే, కె. సతీశ్, ప్రభుదాస్, నర్రే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.