సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): దక్షిణ మండ లం పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను టెక్నాలజీ సహాయంతో హైదరాబాద్ పోలీసులు గుర్తించి, 66 ఫోన్లను రికవరీ చేశారు. వాటిని మంగళవారం బాధితులకు అప్పగించి ఆనందాన్ని నింపారు. లాక్ డౌన్ తొలగించిన తర్వాత దక్షిణ మండలం పరిధిలోని వేర్వేరు రద్దీ ప్రాంతాల్లో చాలా మంది మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. సంబంధిత స్థానిక పోలీసు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. వరుసగా పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన పోలీసు కమిషనర్ అంజనీకుమార్.. అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టి, టెక్నాలజీ సహాయంతో మొబైల్ ఫోన్లను రికవరీ చేయాలని, ఇందుకు పోలీసు స్టేషన్ల వారీగా ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చార్మినార్ ఏసీపీ పర్యవేక్షణలో దక్షిణ మండలం పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి, నిఘా పెంచారు. దక్షిణ మండలం పరిధిలోని వేర్వేరు పోలీసు స్టేషన్లలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల నుంచి 66 ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. బహదూర్పురా పీఎస్ పరిధిలో 30 ఫోన్లు, హుస్సేనీఆలం పరిధిలో 15, మాదన్నపేటలో 9, కామాటిపురలో 8, కాలాపత్తర్లో 3, చార్మినార్లో ఒక మొబైల్ ఫోన్ను గుర్తించి రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు మంగళవారం అప్పగించారు.
ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లు దొరికిన వారిలో చాలా మంది సొంతంగా వాడుకున్నట్లు పోలీసుల దర్యాప్తు తేలింది. కొంతమంది మాత్రమే అనుమానం రాకుండా ఇతర జిల్లాల్లో తక్కువ ధరకు విక్రయించారు. ఏదైనా వస్తువు దొరికితే పోలీసులకు అప్పగించాలని, ఎవరైనా ఏదైనా వస్తువు విక్రయిస్తే తప్పక ఆ వస్తువు రశీదును పరిశీలించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు.