వాషింగ్టన్ : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ ఎకానమీకి కుదుపులు తప్పవని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అమెరికన్ కంపెనీలు లక్షలాది భారత ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న క్రమంలో ఎకానమీపై ప్రభావం అధికంగానే ఉంటుందని అమెరికాలో అతిపెద్ద పరిశ్రమ సంస్థ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిరన్ బ్రిలియంట్ అంచనా వేశారు.
కరోనా సెకండ్ వేవ్ తో భారత ఎకానమీకి సవాళ్లు తప్పవని, ఈ పరిణామం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ప్రజలకు సాయంపై తాము కేంద్రీకరించామని చెప్పారు. ఇక భారత్ కు అవసరమైన వైద్య పరికరాలు, ఆక్సిజన్ సరఫరాలు, ఇతర అవసరాల కోసం అమెరికన్ కంపెనీలు పబ్లిక్-ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాయి.