ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ మహారాష్ట్రను వెంటాడుతున్న క్రమంలో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లతో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్న సీఎం కొవిడ్-19 పరిస్థితిని సమగ్రంగా సమీక్షించనున్నారు. లాక్డౌన్ నిబంధనలను మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశంలో మహమ్మారి కట్టడికి సీఎం ఠాక్రే మరిన్ని చర్యలు ప్రకటిస్తారని భావిస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో కొవిడ్-19 వ్యాప్తి కొంత అదుపులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడిగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలను తాము సిద్ధం చేసినా తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.