ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : క్యాన్సర్ పెద్దలకే కాదు… చిన్నారులకూ శాపంగా మారింది. పుట్టుకతో కొందరికి వ్యాధి సంక్రమిస్తుండగా, మరికొందరు వయసు పెరుగుతున్న క్రమంలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కారణాలేమైనా వ్యాధి బారిన పడిన పిల్లలకు ప్రత్యేక చికిత్సలు అవసరం. నిమ్స్ దవాఖానలో ప్రస్తుత ఆంకాలజీ విభాగంలో పిల్లల కోసం కొన్ని బెడ్స్ కేటాయించారు. అయితే ప్రత్యేక ఓపీ సేవలు మాత్రం అందుబాటులో లేవు.
ఆ కొరతను తీర్చేందుకు ఆంకాలజీ విభాగంలోనే ఓపీ క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్ను శనివారం డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ ప్రారంభించనున్నారు. పిల్లలకు ఎక్కువగా సంక్రమించే ల్యుకేమియా, కేంద్రనాడి వ్యవస్థ కణుతులు, నాన్ హడ్కిన్, లింఫోయా వంటి క్యాన్సర్లపై ఈ పీడియాట్రిక్ క్లినిక్లో డాక్టర్లు వైద్యసేవలందిస్తారు.
సెప్టెంబర్ను చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా గుర్తించిన నేపథ్యంలో ఈ క్లినిక్ ఇదే నెలలో ప్రారంభిస్తున్నట్లు నిమ్స్ లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేశ్ తెలిపారు. బుధ, శనివారాల్లో ఈ క్లినిక్ అందుబాటులో ఉంటుందన్నారు. వీటితో పాటు మంగళవారం స్త్రీ జననేంద్రియ ఆంకాలజీ, గురువారం హెమలాజీ, శుక్రవారం సర్వైవర్షిప్ క్లినిక్ల ద్వారా సేవలు అందించనున్నారు.