హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్యూ) ఉద్యోగులకు కూడా దానిని వర్తింపజేసింది. రాష్ట్రప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు (నాన్-టీచింగ్ సిబ్బంది), ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచుతూ ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం సర్క్యులర్ జారీచేశారు. మార్చి 30వ తేదీనుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని అన్నిశాఖల అధిపతులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతోపాటు పదవీవిరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్టు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్-1984ను సవరించి తెలంగాణ యాక్ట్ 3/2021ను తీసుకొచ్చి పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని అమలుచేశారు. పీఎస్యూల ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచాలని సీఎం ఆదేశించటంతో ఆ మేరకు సీఎస్ సర్క్యులర్ జారీచేశారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
హల్దీవాగులోకి రెండ్రోజుల్లో జలాలు
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు