సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ) : మీసేవ కేంద్రానికి చెందిన పాస్వర్డ్ను హ్యాక్ చేసి ట్రాఫిక్ ఈ-చలాన్లు సొమ్ము చేసుకుంటున్న ఒక సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్భగవత్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన కాసాని జగన్ ఇంటర్ మధ్యలో వదిలేసి ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. వచ్చే జీతం కుటుంబ పోషణతోపాటు తన అవసరాలు తీర్చుకోవడానికి సరిపోవడం లేదు. ఇతడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో చలానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చలాన్లు చెల్లించేందుకు మీ సేవ కేంద్రాలకు వెళ్లేవాడు.
అక్కడే మీ సేవకు సంబంధించిన సైట్లోకి వెళ్లేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ను సంపాదించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హస్తినాపురానికి చెందిన ఒక మీ సేవ కేంద్రం యూజర్ ఐడీని సంపాదించాడు. దాని ఆధారంగా పాస్వర్డ్ను తెలుసుకునేందుకు యూట్యూబ్లో పలు వీడియోలు చూశాడు. మూడు నాలుగుసార్లు ప్రయత్నం చేయడంతో మీసేవ పాస్వర్డ్ తెలిసిపోయింది. అయితే మీ సేవ కేంద్ర నిర్వాహకులకు సంబంధించిన డబ్బులు ఆయా ఈ చలానాలకు చెల్లిస్తూ ఉల్లంఘనదారులు ఇచ్చిన డబ్బులను తన జేబులో వేసుకుంటున్నాడు. తమ ఖాతాలో జమచేసిన డబ్బు అయిపోతుండడంతో అనుమానం వచ్చిన మీ సేవా నిర్వాహకులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో జగన్ బాగోతం బయటపడింది. మొత్తం రూ.28 వేలు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.