ఖైరతాబాద్, ఆగస్టు 27 : బంగారు ఆభరణాల మా యంపై పంజాగుట్ట పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. ముంబైకి చెందిన రనూజా జ్యువెల్లరీస్లో పనిచేస్తున్న గులాబ్ మాలిక్ (32) 2.12 కేజీల బంగారు ఆభరణాలను నగరంలోని దుకాణాలకు సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన క్రమంలో అవి మాయమైనట్లు యజమానితో కలిసి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గులాబ్ మాలిక్ అమీర్పేట్లోని నగల బ్యాగు మాయమైందని చెప్పడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్ట పీఎస్కు బదిలీ చేశారు. నగల బ్యాగు తొలుత అమీర్పేటలోనే కనిపించకుండా పోయిందని, దీంతో తాను లక్డీకాపూల్ స్టేజీ వద్ద దిగానని సదరు వ్యక్తి చెప్పిన మాటల్లో కట్టు కథ ఏమైనా ఉందా అనే కోణంలో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
డీఐ నాగయ్య నేతృత్వంలో నాలుగు బృందాలు ముంబైకి బ యలుదేరి వెళ్లాయి. కాగా, గులాబ్మాలిక్ చెప్పిన కథనం, అతని యజమానిగా చెబుతున్న శ్రవణ్ గెహ్లాట్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసులో కొత్త కోణాలు గుర్తించారు. వివిధ నగరాల్లో ఆభరణాలు సరఫరా చేసే గులాబ్ మాలిక్ బయలుదేరిన ముంబై హైవేలోని చునాబట్టి ప్రాంతం నుంచి బస్సు వెళ్లిన పుణె మీదుగా జాతీయ రహదారులపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బస్సు హాల్టింగ్ మధ్యలో అతను దిగి ఎవరినైనా కలుసుకున్నాడా….గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో అతనికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఇందు కోసం ఆ రాష్ర్టాలకు సైతం ప్రత్యేక బృందాలు తరలివెళ్లాయి. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఐ నాగయ్య తెలిపారు.