పరిశుభ్రత, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా గురువారం నుంచి పల్లె,పట్టణ ప్రగతి ప్రారంభం కాబోతున్నది. వీధుల శుభ్రత, మెరుగైన పారిశుధ్యం, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, వరద సాఫీగా వెళ్లేలా చేయడం, శిథిల భవనాల కూల్చివేతతోపాటు హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలకు ఈ ‘ప్రగతి’ యజ్ఞంలో ప్రాణం పోయనున్నారు. పట్టణ ప్రగతి నిర్వహణకు గ్రేటర్వ్యాప్తంగా 955 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, కార్యక్రమం నిర్వహణకు బల్దియా రూ.936 కోట్లు కేటాయించింది. వార్డుస్థాయి ప్రతినిధి మొదలు మంత్రి వరకు, కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రగతి పండుగలో భాగస్వాములయ్యేలా ఇప్పటికే మార్గనిర్దేశనం చేశారు. పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కార్మిక, విద్యాశాఖ మంత్రులు మల్లారెడ్డి, సబితారెడ్డిలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఒక్కరోజే 2 వేల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నారు.
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ‘ప్రగతి’ సాధనకు గ్రేటర్ సిద్ధమైంది. నగరవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు నేటి నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 955 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అంతేకాక రూ. 936 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు స్థల సేకరణ చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రగతి కార్యక్రమాన్ని పంజాగుట్ట దుర్గానగర్ కాలనీ పార్క్లో గురువారం ఉదయం 9.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, తార్నాక డివిజన్లోని సత్యనగర్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పాల్గొని ప్రారంభించనున్నారు.