సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేయడంతోపాటు కార్పొరేట్ స్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఒక్కోటి సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగుపడగా, వీటిపై ఒత్తిడి తగ్గించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లోనూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు పట్టణాల్లో మాదిరి అందుబాటులో ఉండవు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆర్ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. పరిస్థితి కొంత క్లిష్టంగా మారుతుంటే నగరానికి పరుగులు తీయడం సహజం. పల్లె దవాఖానలు అందుబాటులోకి వస్తే చిన్నపాటి జ్వరం వచ్చినా సొంత గ్రామంలోనే చక్కటి వైద్యం చేయించుకోవచ్చు. ఫలితంగా రోగి త్వరగా కోలుకోవడంతోపాటు పట్టణాలకు, నగరానికి వెళ్లే బాధలు తప్పుతాయి.
గ్రేటర్వ్యాప్తంగా 222 బస్తీ దవాఖానలు ఉన్నాయి. సీజనల్, సాధారణ అనారోగ్య సమస్యలతోపాటు కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ దవాఖానలు కీలకపాత్ర పోషించాయి. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు నిలిచినా బస్తీ దవాఖానల్లో మాత్రం నిరాటంకంగా సాగాయి. కరోనా టెస్టులతోపాటు పలుచోట్ల వైరస్ సోకిన తర్వాత కూడా సేవలందించడం విశేషం.గ్రేటర్ చుట్టూ
పల్లె దవాఖానల ప్రతిపాదనతో గ్రేటర్ చుట్టూ 128 దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 93, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 35 పల్లె దవాఖానలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ దవాఖానలల్లో బస్తీ దవాఖానల్లో ఉన్నట్లే అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలతోపాటు మందులు అందజేస్తారు.