కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న రోగులకు అందించే ప్రాణవాయువు కొరత తీరనుంది. ఇప్పటికే ఆకాశమార్గాన ప్రత్యేక విమానంలో వెళ్లిన ట్యాంకర్లు ఇటీవల నగరానికి రాగా, ఆదివారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైలులో 5 ఆక్సిజన్ ట్యాంకర్లు నగరానికి చేరాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ఇదేనని, సనత్నగర్ గూడ్స్ కాంప్లెక్సుకు ఈ రైలు చేరుకున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ప్రకటించారు. ఏప్రిల్ 28న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ సైడింగ్ నుంచి ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రత్యేక రైలులో 1,334 కిలోమీటర్ల దూరంలోని ఒడిశాకు వెళ్లాయని, తిరుగుమార్గంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా గ్రీన్ కారిడార్ ద్వారా 124 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేరవేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి రెండో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పటికే ఒడిశాకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ర్టాల అవసరాలకనుగుణంగా ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు.