సుల్తాన్బజార్, జూన్ 13 : కరోనా సోకి వైరస్ ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కరి చేయడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందై ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది. మొన్నటివరకు కరోనా తీవ్రత అధికంగా ఉండడం వల్ల ద్రవరూప ఆక్సిజన్(లిక్విడ్ ఆక్సిజన్)కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలా దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల కోసం రోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అయితే ద్రవరూప ఆక్సిజన్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ సహజ పద్ధతిన ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను రోగులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో ఎర్రగడ్డ చెస్ట్ దవాఖాన, మానసిక చికిత్సాలయం, ఈఎస్ఐ దవాఖానలలో సహజరీతిలో ఉత్పత్తయ్యే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఏడాది నుంచి కొవిడ్ రోగులకు విశేష సేవలందిస్తున్న కింగ్కోఠిలోని జిల్లా దవాఖానలో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్మిస్తున్న సహజ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పనులు పూర్తయి ప్లాంట్ అందుబాటులోకి వస్తే లిక్విడ్ ఆక్సిజన్ తగ్గించి, సహజ ఆక్సిజన్ను రోగులకు అందించనున్నారు.
ప్రకృతి నుంచి వచ్చే గాలిని ఉత్పత్తి చేసే ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ను త్వరలో రోగులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు పనులన్నీ చివరిదశకు చేరుకున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడి ఉత్పత్తి ఆగితే జనరేటర్ అవసరం లేకుండా సహజంగా వచ్చిన గాలిని సిలిండర్లలోకి పంపించి వినియోగిస్తాం. సహజ సిద్ధమైన గాలి నుంచి నిమిషానికి 960 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. -డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్కోఠి జిల్లా దవాఖాన