మేడ్చల్, మే 22(నమస్తే తెలంగాణ) : కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే, లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాఖ చేపట్టిన ఫీవర్ సర్వేతో కొవిడ్ సోకిన వారిని ముందుగానే గుర్తించి హోం ఐసొలేషన్లో వైద్యం అందిస్తూ.. నయం చేస్తున్నారు. దీంతో ప్రభు త్వ, ప్రైవేట్ దవాఖానలకు చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరాలు సైతం తగ్గాయి. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో 148 ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు ఉండ గా.. 5309 బెడ్లు ఉన్నాయి.
ప్రతిరోజు ఒక్క కొవిడ్ బాధితుడికి సుమారు 15లీటర్ల మేర ఆక్సిజన్ అవసరం ఉండగా.. 5309 మంది బాధితులకు 79,635 లీటర్ల వినియోగం ఉంటుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు. ఫీవర్ సర్వేతో బాధితులను ముందుగానే గుర్తించి.. మందులు అందజేసి హోం ఐసొలేషన్లోనే నయం చేస్తుండటంతో.. దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిందని తెలిపారు. దీంతో బెడ్లు ఖాళీగా దర్శనమిస్తుండగా.. ఆక్సిజన్ అవసరాలు తగ్గాయని.., ఇప్పటివరకు దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు వైద్యశాఖ బృందాలు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలపై ఆరా తీస్తున్నారని, ఆక్సిజన్ కావాలంటే 24గంటల ముందే దవాఖాన నిర్వాహకులు సమాచారం అందించాలని కోరారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్ అవసరాలు ప్రస్తుతానికి తగ్గాయి. ఫీవర్ సర్వే, లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గింది. ఫీవర్ సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తక్షణమే వైద్యం అందించడంతో త్వరగా కోలుకుంటున్నారు. దవాఖానలకు చికిత్స నిమిత్తం వచ్చేవారి సంఖ్య తగ్గింది. దవాఖానల్లో బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. – మల్లికార్జునరావు, వైద్యాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్యశాఖ బృందాల ద్వారా ఆక్సిజన్ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆక్సిజన్ కొరత ఉంటే 24 గంటల ముందే వైద్యశాఖకు సమాచారం అందించాలని దవాఖానల నిర్వాహకులను ఆదేశించాం. ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరతలేదు. బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. – వేణుగోపాల్, డీఈ8ఎంవో, మేడ్చల్-మల్కాజిగిరి