దుండిగల్,అక్టోబర్20: నిజాంపేట కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని ఎస్ఎల్జీ వైద్యశాలలో బుధవారం ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది రోగులకు ఉచితంగా ఎముకల సాద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో ఎస్ఎల్జీ దవాఖాన ఆర్థోపెడిక్ సర్జన్ డా.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ శరీరంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉన్నవారికి ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. దీని వల్ల ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతుందని, తక్కువ వయస్సులోనే ఎముకలు అరిగిపోవడం, విరిగే ముప్పు ఎక్కువగా ఉంటాయన్నారు. వృద్ధులతో పాటు నడివయస్సు వారు సైతం ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధిబారిన పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రధానంగా ఈ వ్యాధి పోషకాహారలోపం వల్ల్లే వస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎస్ఎల్జీ వైద్యశాల సీఎండీ, చైర్మన్ దండు శివరామరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు, మెడికల్ డైరెక్టర్ డా.ప్రదీప్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.