సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్య చదవడంలో బాలికలు, బాలురతో పోటీ పడుతున్నారని, వారి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. వర్సిటీ 2018 -20 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 80 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో గోల్డ్మెడల్స్ సాధించగా, వారిలో అత్యధికంగా 85 శాతం బాలికలే (68 మంది) పొందారని చెప్పారు. బాలురు 12 మంది ఉన్నారని అన్నారు. అలాగే 343 పీహెచ్డీ అవార్డు పొందే వారిలో 148 మంది అమ్మాయిలేనన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్-21లో 72 వేల మంది పరీక్షకు హాజరైతే..వారిలో 50 వేల మంది వరకు బాలికలే ఉన్నట్లు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్హౌస్లో సోమవారం నిర్వహించిన యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవ సన్నాహాక సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. 750 మంది స్కాలర్లు పీహెచ్డీ సాధించగా, వారిలో ఇప్పటికే 350 మంది పట్టాలు స్వీకరించారన్నారు. అలాగే మొత్తం 80 మంది గోల్డ్ మెడల్స్కు ఎంపికైనట్లు చెప్పారు. 27న స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డి హాజరువుతున్నట్లు చెప్పారు. సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ వెంకటేశ్, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఓయూ పీఆర్వో సుజాత తదితరులు పాల్గొన్నారు.