ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 20 : విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల అకాడమిక్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 2017-18, 2018 -19, 2019-20, 2020-21 విద్యాసంవత్సరాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 70 బంగారు పతకాలు, 9 నగదు బహుమతులు, ర్యాంక్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వీటి ద్వారా దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.
వర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు నిర్మాణానికి ఇక్కడ నేర్చుకున్నది పునాధిగా ఉపయోగపడుతుందని అన్నారు. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించిన కళాశాల పూర్వ విద్యార్థిని ఎంపికచేసి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాన్ని సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్కు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.కుమార్, ప్రొఫెసర్లు వి.భీక్ష్మ, సురేశ్కుమార్, పి.చంద్రశేఖర్, విద్యాసాగర్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ భారతి తదితరులు పాల్గొన్నారు.