ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 20: త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విద్యార్థి ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గెల్లుకే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూ జేఏసీ, టీఎస్జేఏసీ, ఎస్ఎఫ్ఎస్జే, టీవీఎస్, ఎంబీసీ విద్యార్థి సంఘం తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఎస్జేఏసీ, ఓయూజేఏసీ చైర్మన్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ తమ ఉద్యమ సహచరుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు టీఆర్ఎస్ టీకెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమతో కలిసి ఉద్యమించడంతో పాటు జైలు జీవితం సైతం గడిపిన గెల్లును గెలిపించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా, రైతు, విద్యా వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసున్నదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, బడుగు బలహీనవర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎ. దత్తాత్రేయ మాట్లాడుతూ హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పదకొండు యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నాయకులు అక్కడే ఉండి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రవీందర్నాయక్, అశోక్యాదవ్, హరీశ్గౌడ్, దాసరి నారాయణ, చిరంజీవి బెస్త, బీర్పూర్ రమేశ్, చేపూరి ప్రణయ్, మందారం సుదర్శన్, కొప్పుల ఆనంద్, కొండూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.