సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ : మారుతున్న కాలానికనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. అప్పుడే పరిపాలన సులువవుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టం (యూఎంఎస్), ఈ- ఆఫీస్ సొల్యూషన్స్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. యూఎంఎస్ ద్వారా వర్సిటీలో పరిపాలన మరింత సులువుగా జరుగుతుందన్నారు.
యూఎంఎస్లో దాదాపు 19 మాడ్యుల్స్ ఉంటాయని, అవి విభిన్న పనుల్లో ఉపయోగపడుతాయని వివరించారు. విద్యార్థులకు కూడా కళాశాల, హాస్టల్ ఫీజు చెల్లించే అవకాశం ఉందని, ఇలా అనేక అంశాల్లో ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఓయూ వీసీ డి.రవీందర్ మాట్లాడుతూ.. యూఎంఎస్ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత వర్సిటీ కార్యకలాపాలతోపాటు మెరుగైన కమ్యూనికేషన్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు.
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది హాజరును పర్యవేక్షించడం ఎంతో సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణతో పాటు డీన్లు, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను రూసా 2.0, స్టాటిస్టికల్ సెల్ కార్యాలయం అధికారులు నిర్వహించారు.
ఈ -ఆఫీస్, యూఎంఎస్తో యూనివర్సిటీలో పరిపాలన విధానం సులభమవుతుంది. ప్రధానంగా కాగిత రహిత పాలన సాగుతుంది. ఓయూ నుంచి అఫిలియేషన్ పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ కాలేజీలకు సంబంధించిన కార్యకలాపాలు పారదర్శకంగా సాగుతాయి. విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ వంటి కార్యకలాపాలు కూడా కొత్త విధానంతో సాగుతాయి. విద్యార్థులకు సంబంధించిన అసైన్మెంట్లు, రికార్డుల వ్యవహారాలతోపాటు విద్యార్థులకు, అధ్యాపకులకు సంబంధించిన డాటా కూడా ఈ-ఆఫీస్ ద్వారా భద్రంగా ఉంటుంది.
టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన వివరాలు, నిర్వహణ ఖర్చులు, బిల్లుల చెల్లింపులు, నిర్మాణం, మరమ్మతు పనుల ఖర్చులు, పరీక్షల నిర్వహణ ఖర్చులు, ఫీజుల వల్ల రాబడి వంటి విషయాలన్ని ఈ-ఆఫీస్, యూఎంఎస్ పరిధిలోకి రానున్నాయి.
ఈ -ఆఫీస్, యూఎంఎస్ విధానం అమల్లోకి రావడంతో ఓయూలోని కళాశాలలు, పీజీ కళాశాలన్నీ కలిపి దాదాపు 12వేల మంది విద్యార్థులు ఓయూ ఈ-ఆఫీస్ అటెండెన్స్ పరిధిలోకి వస్తారు. దీంతో విద్యార్థులకు సంబంధించిన పూర్తి డాటా యూఎంఎస్ పరిధిలోకి వెళ్తుంది. వీరితో పాటు ప్రొఫెసర్లు – 359, ఎమిరైటస్ ప్రొఫెసర్లు 11, అసోసియేట్ ప్రొఫెసర్లు 106, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 173, ఉద్యోగులు 2,730 మంది ఉన్నారు. విద్యార్థులకు, స్టాఫ్కు యూనిక్ గుర్తిపు కార్డులు జారీ చేయనున్న నేపథ్యంలోనే యూఎంఎస్, ఈ -ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చా రు.
భవిష్యత్లో ఓయూ పరిధిలో 400పైగా ఉన్న అఫిలియేషన్ కశాళాలల విద్యార్థులకు కూడా హాజరు యూనిక్ ఐడీకార్డులు జారీ చేయడం తోపాటు యూఎంఎస్ ద్వారా వారి హాజరు సేకరించే అవకాశాలు ఉన్నట్లు వర్సిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దాదాపు 2.50లక్షల మంది విద్యార్థుల డాటా కూడా ఓయూ ఈ-ఆఫీస్ పరిధిలోకి వస్తుందని, విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఓయూలో ఉం టుందని అధికారులు చెబుతున్నారు.