శాస్త్రీయ భావాలు పెంపొందించే యూనివర్సిటీలో మతతత్వ సంస్థల సమావేశాలా?
ఆర్ఎస్సెస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘ సదస్సుపై విద్యార్థి సంఘాల నిరసన
అనుమతి వెంటనే రద్దు చేయాలని డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం గా ఈ నెల 22, 23వ తేదీల్లో ఓయూలో నిర్వహించనున్న సదస్సు వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ సదస్సును ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన ‘అఖిల్ భారతీయ్ రాష్ట్రీయ్ శైక్షిక్ మహా సంఘ్’ (ఏబీఆర్ఎస్ఎం)తో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమైంది. సదస్సును ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనుండగా, దానిని రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తామే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. శాస్త్రీయ భావాలకు అనుగుణంగా నడవాల్సిన యూనివర్సిటీలలో మతోన్మాద కార్యకలాపాలు నిర్వహించడం దారుణమని, తక్షణమే వాటిని విరమించుకోవాలని అన్నారు. ఏబీఆర్ఎస్ఎంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా నిర్వహించనున్న సదస్సును వెంటనే రద్దు చేయాలని వారు కోరారు.
ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్లకు వేర్వేరుగా పలు విద్యార్థి సంఘాలు వినతిపత్రం అందజేశాయి. అనంతరం, విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు దేశ వ్యాప్తంగా మతోన్మాద భావాలు ఉసిగొల్పుతూ, దళిత, గిరిజన, మైనారిటీలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.
భారత రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘంతో కలిసి అధికారికంగా ఓయూ సదస్సు నిర్వహించాలని భావించడం హేయమైన చర్య, ఇది రాజ్యాంగ విరుద్ధమని అని మండిపడ్డారు. యూనివర్సిటీలు విశ్వంలోని జ్ఞానాన్ని, జీవన శైలిని, రేపటి భవితవ్యాన్ని గురించి విద్యార్థులకు బోధించాలి. కాని, ప్రజల్లో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించే మతతత్వ సంఘాలతో ఏకం కావడం శ్రేయస్కరం కాదని వారు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు యూనివర్సిటీలు సహకరించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సదస్సులు నిర్వహించే స్వాతంత్య్రం అందరికీ ఉందని, కానీ, ప్రభుత్వ ఆదాయంతో నడిచే విద్యా సంస్థలు మతతత్వ భావజాలం ఉన్న ఏబీఆర్ఎస్ఎంతో కలిసి సదస్సు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
తక్షణమే సదస్సు అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, టీఎస్ ఎంఎస్ఎఫ్, ఎస్ఎస్యూ, వైఎస్సార్టీపీ తదితర సంఘాల నాయకులు క్రాంతిరాజ్, రహమాన్, మూర్తి, రవినాయక్, సుమంత్, శ్యామ్, తిరుమలేశ్, రంజిత్, దివాకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.