సుల్తాన్బజార్,జూలై 25: కరోనా సహా ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధతే ఉత్తమ మార్గమమని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య,సమాచార సాంకేతిక విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం ఉస్మానియా దవాఖానలోని ఓపీ బ్లాక్లో కాంగ్నిజెంట్,రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్టుల సహకారంతో రూ.1.5 కోట్ల నిధులతో 50 పడకల అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీయూ వార్డును సందర్శించారు. అనంతరం ఆయన కాంగ్నిజెంట్,రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్టు సేవలను ప్రశంసించారు.
అనంతరం ఆయన రోగులకు మార్గనిర్దేశనం,సలహాలు ఇవ్వడంతో పాటు ఆరోగ్య సూచనలు అందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. స్కిన్ బ్యాంక్ వంటి వైద్య సేవలను ఉస్మానియాలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ మాట్లాడుతూ 50 పడకల నూతన ఐసీయూతో కలిపి దవాఖానలో 2500 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఐసీయూను ఏర్పాటు చేసేలా కృషి చేసిన కాంగ్నిజెంట్,రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్టు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్టు అంతర్జాతీయ అధ్యక్షుడు దిలీప్ కుమార్ సింగ్,ఇండియా అధ్యక్షుడు మోరియా ఫిలిఫ్ ప్రాజెక్ట్ హీల్ అనే మా పాన్ ఇండియా మెడికల్ రిలీఫ్ ప్రాజెక్టు కింద సేవ చేసేందుకు భాగస్వాములను చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్లు సేకరించి దేశ వ్యాప్తంగా 70 ప్రభుత్వ దవాఖానల్లో 2500 పడకల ఐసీయూలను ఏర్పాటు చేశామన్నారు. రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో ఎన్నో స్కూళ్లలో తరగతి గదులను నిర్మించామన్నారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్వో డాక్టర్ శేషాద్రి,హెచ్వోడీలు డాక్టర్ పాండునాయక్,డాక్టర్ బాలరాజు,నర్సింగ్ సూపరింటెండెంట్ ఆర్ సుజాత,ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ,డాక్టర్ శ్రీనివాసులు,డాక్టర్ సిద్ధిఖి,డాక్టర్ రఫీక్,డాక్టర్ మాధురి,డాక్టర్ సుష్మ, డాక్టర్ మాధురి తదితరులు పాల్గొన్నారు.