సుల్తాన్బజార్,జూన్ 23 : పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ప్రభుత్వ దవాఖాన పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని ఉస్మానియా ప్రభుత్వ వైద్య కళాశాల అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ తపాడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిత్యం 5 వేలమంది రోగులకు ఓపీలో, 1500 మంది ఇన్పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఘనత ఉస్మానియా దవాఖానదన్నారు. బుధవారం కోఠిలోని కళాశాల ఆడిటోరియంలో అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కృష్ణమూర్తి, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృష్ణారెడ్డి, చైర్మన్ డాక్టర్ రవీందర్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. 100 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని, ఇందులో ఎకరన్నర మాత్రమే హెరిటేజ్ పరిధిలోకి వస్తుందని, మిగతా భూమిలో అన్ని హంగులతో అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ విషయమై పలుమార్లు సీఎం కేసీఆర్కు అసోసియేషన్ తరపున వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లలో వైద్యులు చక్కగా సేవలందించారన్నారు.
ఉస్మానియా దవాఖాన ఆవరణలోని పాత (హెరిటేజ్)భవనాన్ని కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్,కార్యదర్శి డాక్టర్ రంగలు అన్నారు. గ్రేటర్లో మూడు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ దవాఖానలు నిర్మిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.