సుల్తాన్బజార్,మే 29. హైపర్ టెన్షన్,తీవ్ర జ్వరంతో భాధపడుతున్న ఓ నిండు గర్భవతికి ప్రసూతి దవాఖానలో కాకుండా ఉస్మానియా ధర్మాసుపత్రిలో కాన్పు చేశారు. అనేక ఇబ్బందులతో అటూ ఇటూ తిరిగిన నానా అవస్థలు పడిన ఆ మాతృమూర్తి శనివారం రాత్రి ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ప్రసవ ప్రయాణం సుఖాంతమైంది. కరీంనగర్కు చెందిన కుమారి(25), కుర్మయ్యలు భార్యాభర్తలు. గురువారం నాడు కుమారికి నాలుగో కాన్పులో భాగంగా పురుటి నొప్పులు అధికమవడంతో అదే రోజు గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి గాంధీ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. గాంధీలో కేవలం కరోనా రోగులను మాత్రమే చేర్చుకుంటామని దవాఖాన వైద్యులు చెప్పడంతో వారు ఆ రోజు రాత్రి పది గంటలకు సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు తీసుకొచ్చారు.
శుక్రవారం ఉదయం ప్రసూతి వైద్యులు పరీక్షించారు. కుమారికి 102 జ్వరం ఉండడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఉస్మానియా దవాఖానలోని ఏఎంసీకి తరలించాలని నిశ్చయించారు. ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఉస్మానియా దవాఖానలో ఏఎంసీ వార్డులో కుమారి పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ఆమెకు వైద్యసేవలు అందేలా చూశారు. శనివారం కుమారికి ప్రసవం చేసే నిమిత్తం ప్రసూతి దవాఖాన నుంచి వైద్య బృందం ఉస్మానియాకు వెళ్లింది. రక్తపోటును, శ్వాసలో ఇబ్బందులను నియంత్రిస్తూ ఆమెకు శనివారం రాత్రి ప్రసవం చేశారు. కుమారి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కరోనా నెలకొని ఉన్న గడ్డుకాలంలో శ్రమ తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లతో తనకు ప్రసవం చేసి ప్రాణాన్ని రక్షించినందుకు కుమారి..వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.