అది 1908 సంవత్సరం.. సెప్టెంబర్ 26, 27..ఆ రెండ్రోజులు భారీ వర్షాలు కురవడంతో నగరం అతులాకుతులమైంది. ఈ నేపథ్యంలో 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా జలప్రలయంలో చిక్కుకుపోయారు.. ఎందరో ప్రాణాలు వదిలారు. దూసుకొస్తున్న వరద నుంచి రక్షించుకునేందుకు కొందరు ఉస్మానియా దవాఖాన వెనుక భాగంలో ఉన్న చింతచెట్టుపైకి ఎక్కి(అఫ్జల్పార్కు) ప్రాణాలను నిలుపుకొన్నారు. కన్నతల్లిలా అక్కున చేర్చుకున్న ఆ మహావృక్షం..సుమారు 150 మందిని కాపాడింది. ఆనాటి ఉపద్రవానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ ఘటన జరిగి నేటికి 113 ఏండ్లు. ఏటా ఈ పార్కులో ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. వరద మృతులకు నివాళులర్పిస్తుంటారు. మంగళవారం ఫోరం చైర్మన్ మణికొండ వేదకుమార్ నేతృత్వంలో కార్యక్రమం జరుగనున్నది. -సుల్తాన్బజార్,సెప్టెంబర్ 27