హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ): కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ పీక్స్టేజ్కి చేరుకొన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఇంకా ఆ పరిస్థితి రాలేదని, అందుకు మరికొంత సమయం పడుతుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. జూలై నెలాఖరుకు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ అక్టోబర్లో థర్డ్వేవ్ వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కరోనా డాటా విశ్లేషణలో నిమగ్నమైన డాక్టర్ అగర్వాల్.. దేశంలో థర్డ్వేవ్ రాబోతున్నదంటూ ఇటీవల భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్ చేసిన హెచ్చరికలతో ఏకీభవించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి పీక్ స్టేజ్కు చేరిన తరువాత 10 నుంచి 15 రోజులపాటు ఆ దశ కొనసాగుతుంది. అనంతరం క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉన్నది. ఢిల్లీ, మహారాష్ట్ర ఇప్పటికే పీక్స్టేజ్కు చేరుకోగా, పలు రాష్ర్టాలు వచ్చే వారం, పది రోజు ల్లో ఆ దశకు చేరతాయి. దేశవ్యాప్తంగా జూలై చివరికల్లా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుతుంది. అక్టోబర్లో మళ్లీ థర్డ్వేవ్ మొదలవుతుంది’ అని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు. థర్డ్వేవ్ ఎంతకాలం కొనసాగుతుంది? దాని తీవ్రత ఎలా ఉంటుంది? అనే విషయాలపై ఇప్పుడే చెప్పలేమన్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రత అనేక అంశాలపై ఆధాపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
దేశంలో కరోనా పీక్స్టేజ్ ఇంకా రాలేదని, రానున్న కొద్ది రోజుల్లో నమోదయ్యే డాటా ఆధారంగా ఆ దశ ఎప్పుడొస్తుంది? కేసుల సంఖ్య ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనేది నిర్ణయించగలమని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు. ముందు అంచనా వేసినట్లుగా దేశంలో సెకండ్ వేవ్ పీక్స్టేజ్ ఈ నెల 10-15 తేదీల్లో కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా వస్తుందని చెప్పారు. ఇది ఆందోళనకర అంశమని, దీనిపై తాము దృష్టి కేంద్రీకరించామన్నారు. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ర్టాలు ఇప్పటికే పీక్స్టేజ్కు చేరుకున్నాయని, హర్యానాలో ఇంకా పీక్స్టేజ్ రాలేదని వివరించారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర ఆరు రాష్ర్టాల్లో ఇప్పుడే పీక్స్టేజ్ మొదలైందని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో వచ్చే పది, పదిహేను రోజుల్లో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఒడిషా, అస్సాం, పంజాబ్ రాష్ర్టాల్లో పీక్ సమయం ఇంకా తెలియడంలేదన్నారు. రానున్న కొద్దిరోజుల్లో నమోదయ్యే డేటాను విశ్లేషించిన తరువాతే ఒక నిర్థారణకు వచ్చే వీలుంటుందని డాక్టర్ అగర్వాల్ వివరించారు.
సెప్టెంబర్-అక్టోబర్ వరకు సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి.వైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్స్ను గుర్తించి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి.ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.