హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకున్నవారికి నిర్ధారణ పరీక్ష అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంగా చెప్తున్నా కొన్ని ప్రైవేటు కంపెనీలు నెగెటివ్ రిపోర్టు కావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. నెగెటివ్ రిపోర్టు ఉంటేనే విధుల్లోకి రావాలని, లేకపోతే రావొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కోలుకున్నవాళ్లు పరీక్ష కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వైరస్ సోకినవాళ్లు, సోకనివాళ్లు ఒకే లైన్ కట్టడంతో కొందరు రీఇన్ఫెక్షన్ల బారిన పడుతుండగా, కిట్లు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల కిట్ల కొరత ఏర్పడి లక్షణాలున్నవారికి పరీక్ష చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న పాజిటివ్ వ్యక్తులు 10రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాలి. తర్వాత మరో 7 రోజులు మాస్కు ధరిస్తూ, ఆరోగ్యస్థితిని గమనిస్తూ ఉండాలి. వీరికి కొవిడ్ నిర్ధారణ పరీక్ష అవసరం లేదు. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 10 రోజుల పాటు చికిత్స తీసుకొంటే సరి. వీరికి కూడా నిర్ధారణ పరీక్ష అవసరం లేదు. తీవ్ర లక్షణాలు ఉంటే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసి, దవాఖానలో చికిత్స అందించాలి. నెగెటివ్ వస్తేనే డిశ్చార్జి చేయాలి.