చిన్నతనంలోనే అనేక కష్టాలు అనుభవించాడు. హెచ్ఐవీ బారిన పడి కండ్ల ముందే కన్న వారు మృత్యువాత పడితే నిస్సాయత స్థితిలో కూరుకుపోయాడు. నా అన్న వాళ్లు చేరదీయకపోవడంతో ఒంటరితనంతో పోరాటం చేశాడు. కష్టాలకు అదరక బెదరక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పట్టుబట్టి చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అయినా ఇది జీవితం కాదని భావించి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు. నా లాగా మరెవరూ కష్టాలు పడొద్దని అనాథ పిల్లల సేవకై కదిలాడు. ముఖ్యంగా హెచ్ఐవీపై అవగాహన పెంచుకొని తన సహచరిణితో కలిసి అరుణోదయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఎందరో అనాథ పిల్లలను చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు గుంటూరుకు చెందిన ఖగ్గ వెంకట్రావ్.
హెచ్ఐవీతో తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలను ఎవరూ చేరదీయని దుస్థితిని గమనించిన వెంకట్రావ్ కాప్రా మండలం జవహర్నగర్లో 2008లో తన సతీమణి ధనలక్ష్మితో కలిసి అరుణోదయ ట్రస్ట్కు అంకురార్పణ చేశారు. ముఖ్యంగా హెచ్ఐవీ బారిన పడిన కుటుంబాల పిల్లలను అక్కున చేర్చుకొని 55 మంది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వీరితో పాటు మరో 45 మంది నిరుపేదల కుటుంబాల పిల్లలకు చదువు చెబుతున్నారు. 2009 నుంచి 2017 వరకు దాదాపు 900 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం 700 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. మహిళలకు కుట్టు, శారీ పెయింటింగ్పై శిక్షణ ఇస్తున్నారు.
గుంటూరు జిల్లా వట్టి చెర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఖగ్గ వెంకటేశ్వర్లు, వీరమ్మ దంపతుల మూడో సంతానం ఖగ్గ వెంకట్రావ్. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో వెంకట్రావ్ అన్నలు పెద్దగా చదువుకోలేదు. వెంకట్రావు మాత్రం మాసాబ్ట్యాంక్లోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం గుంటూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో డ్రాయింగ్ మాస్టారుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో అనుకోని ఘటన ఆయనను విషాదంలోకి నెట్టింది. తన తండ్రి వెంకటేశ్వర్లు 1994లో హెచ్ఐవీతో మృతి చెందాడు. 2000 సంవత్సరంలో తల్లి వీరమ్మ మరణించింది. కుటుంబ పెద్దలను కోల్పోతే ఆ బాధ ఏందో ప్రత్యక్షంగా చూసిన ఆయన వెంటనే హెచ్ఐవీ బారిన పడి కుటుంబ సభ్యులు మృతి చెందితే.. అనాథలైన పిల్లలకు తాను ఏదైనా చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా 2001లో ఉద్యోగాన్ని వదిలేసి కార్యాచరణ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవడానికి ఆరేండ్లు వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు.