కొవిడ్ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర్పుతున్నది. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు రోజు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూస్తున్నది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ శాతం మంది రసాయన రహిత ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి హానికారక రసాయనాలు వినియోగించని, ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, పాల పదార్థాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పలు రిటైల్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. అసోచామ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సేంద్రియ మార్కెట్ విలువ గతంతో పోల్చితే 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగిందని.. అదేవిధంగా సేంద్రియ ఉత్పత్తులతో ఒనగూరే ప్రయోజనాలపై రోజురోజుకూ సామాన్యుల్లో అవగాహన పెరుగుతున్నదని.. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ సేంద్రియానికి డిమాండ్ ఉందని వెల్లడించడం గమనార్హం. ఇక 2020లో 6.38 లక్షల టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలను ఎగుమతి చేయగా వాటి విలువ రూ.4685.90 కోట్లని ఆ నివేదిక తెలిపింది.
సేంద్రియ ఆహార పదార్థాలపై సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బియ్యం, పండ్లు, కూరగాయాలు, పప్పుదినులు, మూలికలు, పానీయాలు, అశ్వగంథ క్యాప్సూల్స్కు డిమాండ్ ఏర్పడింది. కేవలం న్యాచురల్ తేనే అమ్మకాలే గతంతో పోల్చితే 60 శాతం మేర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.