బంజారాహిల్స్,ఆగస్టు 27: సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. శుక్రవారం యూసుఫ్గూడ, షేక్పేట డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు విజయవంతంగా అమలు పరుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు తదితర పథకాలతో పేదలకు ఎంతో ప్రయోజనం లభిస్తోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ పథకం ప్రారంభించినా రచ్చ చేయడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, షేక్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్, నాయకులు పూస వేణు, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.