సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): తక్కువ కూలీ.. ఎక్కువ పని గంటలతో పిల్లలను పిండేస్తున్న యజమానులపై రాచకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన డ్రైవ్లో 172 మంది మైనర్లను వెట్టి చాకిరీ నుంచి కాపాడారు. రాచకొండ పోలీసులు 18 కేసులు నమోదు చేసి, 37 మందిని అరెస్టు చేశారు. వీరిలో 19 మంది భిక్షాటన చేస్తున్న వారిని కూడా పోలీసులు రక్షించి, సంక్షేమ కేంద్రాలకు తరలించారు. కాపాడిన 172 మందిలో 88 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉండగా, 84 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారున్నారు. వీరిలో నేపాల్కు చెందిన ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రక్షించిన ప్రతి మైనర్ను విచారించగా, ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. తల్లిదండ్రులు పంపించడం వల్లే భిక్షాటన చేస్తున్నామని కొంతమంది చెబుతుండగా, ఆకలి బాధను తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నామని మరికొందరు చెప్పారు. రాచకొండ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, రాచకొండ పోలీసులు వీరందరినీ సంక్షేమ శిబిరాలకు తరలించారు. వారి తల్లిదండ్రులు, బంధువుల సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రులను గుర్తించి ఈ మైనర్లను సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) అధికారుల సమక్షంలో అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు, ఎవరూ లేకపోతే వారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పజెబుతామని పేర్కొన్నారు. మైనర్లతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు.