మైలార్దేవ్పల్లి,జూలై14: మైలార్దేవ్పల్లి పరిధి షమాకాలనీలో ఉన్న గాజులు తయారీ పరిశ్రమలో 10 మంది బాల కార్మికులు పనిచేస్తున్నారనే సమాచారంతో బచ్పన్ బచావో ఆందోళన్ స్టేట్ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్మైల్ టీమ్ శంషాబాద్ జోన్ ఇన్చార్జి సత్తయ్య ఆధ్వర్యంలో పరిశ్రమపై దాడి చేసి పట్టుకున్నారు. తలాబ్కట్టకు చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్(28), మహ్మద్ ఇస్మాయిల్ (35) కలిసి షమా కాలనీలో కొన్ని సంవత్సరాలుగా గాజులు తయారీ చేసే పరిశ్రమను నడిపిస్తున్నారని అధికారులు గుర్తించారు. బాల కార్మికులకు భోజనం పెట్టి పరిశ్రమలో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వారితో పని చేయిస్తున్నారని విచారణలో తేలింది. పదిమంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన అధికారులు ఆ పరిశ్రమ యజమానులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. బాలలను జూవైనల్ హోమ్కు తరలించారు.