సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో బాలబాలికలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసిన అధికారులు 20 మందిని కాపాడారు. రాచకొండ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఆపరేషన్ ముస్కాన్ బృందం, స్థానిక పోలీసులు, జిల్లా చైల్డ్ ప్రొబేషన్ యూనిట్, బచ్పన్ బచావో ఆందోళన్, చైల్డ్ లైన్ సభ్యులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ డ్రైవ్లో భాగంగా ఉప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఉప్పల్ కృష్ణా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న 10 మంది బాల బాలికలకు విముక్తి కల్పించి, యజమాని మల్లికార్జున్రావుపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్, మెకానిక్ షాపుల్లో 10 మంది మైనర్లు పని చేయిస్తున్నారని గుర్తించి, వారికి విముక్తి కల్పించారు. వీరిని పనుల్లో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. మైనర్లతో పనులు చేయిస్తే చర్యలు తప్పవని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. పిల్లలను కాపాడిన బృందాన్ని సీపీ అభినందించారు.