సిటీబ్యూరో, జూన్ 30(నమస్తే తెలంగాణ): చిన్నారుల మోములో చిరునవ్వులు పూయించే ఆపరేషన్ ముస్కాన్ గురువారం నుంచి ఈనెల 31 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ కింద అదృశ్యమైన పిల్లలు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న వారు, పరిశ్రమల్లో బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురవుతున్న బాలబాలికలు, భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలు లేదా తల్లిదండ్రుల చెంతకు పంపించడం వంటి చర్యలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సైబరాబాద్ షీ టీమ్స్, సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అధికారులు చర్చించారు. ఆపరేషన్ ముస్కాన్ కింద మొత్తం 9 బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తాయని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్తో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.