ఆన్లైన్లో మందులు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
కొవిడ్ ఆసరాగా సైబర్ నేరగాళ్ల మోసం..
క్యాష్ ఆన్ డెలివరీ కాస్త బెటర్
కరోనా విజృంభిస్తుండటంతో మందులు బయట దొరకడం లేదా..? ఆన్లైన్లో కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. మందులు విక్రయిస్తామంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడే కేటుగాళ్లు కాచుకొని కూర్చున్నారు. మందులు పంపిస్తామంటూ.. ముందుగానే ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టించుకొని చేయిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన పలువురు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. అయితే డబ్బులు ముందుగానే చెల్లించకుండా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తేనే మంచిదని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. డెలివరీ బాయ్ తెచ్చిన సరుకును విప్పి చూశాకనే డబ్బులు చెల్లించాలని తెలుపుతున్నారు.
నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల టిస్లిజుంబ ఇంజక్షన్ను కొనేందుకు ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ట్రేడ్ ఇండియాలో ఆ మందులు లభిస్తున్నాయని ప్రకటన చూశాడు. అందులోకి వెళ్లి వివరాలు పొందు పర్చగానే తాము అందిస్తామంటూ కొందరు వ్యాపారులు ఫోన్ చేశారు. అందులో ఓ వ్యాపారిని నమ్మిన బాధితుడు తనకు ఇంజక్షన్లు కావాలంటూ ఫోన్ చేయడంతో వెంటనే సరఫరా చేస్తామంటూ నమ్మించారు. అయితే ముందుగానే ఒక్కో ఇంజక్షన్కు రూ.50 వేల చొప్పున రెండు ఇంజక్షన్లకు రూ.లక్ష చెల్లించాలంటూ సూచించాడు. దీంతో ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. తాము బెంగళూర్ నుంచి వెంటనే పంపిస్తున్నామంటూ ఒప్పంద సమయంలో చెప్పిన నేరగాళ్లు రెండు మూడు రోజులైనా మందులు పంపించలేదు. ఆ తరువాత ఫోన్ స్విచాఫ్ చేశారు.
ఆన్లైన్లో ఏదైనా కొంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. అయితే మోసం చేయాలనుకునే వారు పార్శిల్ పంపించి అందులో ఏదైనా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బులు ఇచ్చిన తరువాతే డెలివరీ బాయ్ వస్తువులను బాధితుల చేతికి అందిస్తాడు. ఆ తరువాత ఆ పార్శిల్ తెరిచి చూస్తే మందులు కాకుండా ఇతర వస్తువులు ఉంటాయి. అప్పటికే బాధితుడు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించేస్తారు. ఇలా కూడా మోసాలు జరిగే అవకాశాలుంటాయి. ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు సాగాలి.
చాలా వెబ్సైట్లు ఇప్పుడు ఆన్లైన్లో మందులను, కరోనాకు సంబంధించిన వివిధ సామగ్రిని డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తామంటూ ముందుకు వస్తున్నాయి. అయితే ఆన్లైన్ పేమెంట్స్ చేయకుండా, క్యాష్ ఆన్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాకాకుండా ఇంటికి మందులు పంపించిన తరువాతే వాటిని చూసి డబ్బులిస్తామంటూ చెప్పడం ఇంకా మంచిదని సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఆన్లైన్లో మందులు విక్రయించే సంస్థలు ఏమున్నాయనే విషయాన్ని మీ దగ్గరలోని మందుల దుకాణాలు, వైద్యశాలలో వాకబు చేయాలన్నారు. వాళ్ల ద్వారా సమాచారం తీసుకొని మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కోరుకున్న వస్తువులు వస్తాయనుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో మందులు, మాస్క్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఆన్లైన్లో విక్రయిస్తామంటూ సైబర్నేరగాళ్లు ముందుకొస్తున్నారు. ఇండియా మార్ట్ లాంటి సంస్థల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, అవసరమైన వారు ఆ వెబ్సైట్ ఫ్లాట్ ఫామ్లోకి వెళ్లగానే సదరు వ్యాపారికి సమాచారం వెళ్తుంది. మోసాలు చేయాలనే ఉద్దేశంతో అందులోకి వచ్చే వారు మాత్రం పక్కా ప్లాన్తో బాధితులకు వల వేస్తున్నారు. వస్తువులు ఇంటికి వచ్చిన తరువాత డబ్బు ఇస్తామంటే వినడం లేదు. అడ్వాన్స్గా చెల్లిస్తేనే ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువులను పంపిస్తామంటూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే వెనుకా ముందు ఆలోచించలేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఆపద కాలంలో డబ్బులు సులువుగా సంపాదించవచ్చనే దుర్బుద్ధితో సైబర్నేరగాళ్లు కరోనా మందులపై పడ్డారు.