మన్సూరాబాద్, ఆగస్టు 21: కరోనా కారణంగా విదేశాల్లో ఉంటున్న యువతీయువకుల పెండ్లిండ్లకు కలుగుతున్న అడ్డంకులను అధిగమించేందుకు కుటుంబసభ్యులు నూతన పంథాను ఎంచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉంటున్న వారు ఇక్కడికి వచ్చి బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ ఉంటున్న యువతీ, యువకుల తల్లిదండ్రులు సంబంధాలను కుదుర్చుకుంటుంటే.. అక్కడ ఉండే వధూవరులు మిత్రులు, తెలిసిన వారి సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే తరహాలో తెలుగువారి సంస్కృతి, భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని చాటుతూ అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం ఓ వివాహ వేడుక జరుగనుంది. గుంటూరుకు చెందిన పారిశ్రామిక వేత్త, సంఘ సేవకుడు కొలసాని శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు ఎల్బీనగర్లో నివాసముంటున్నారు.
వీరి కుమారుడు సాయి చైతన్య అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. నిజాంపేటకు చెందిన వల్లభనేని వెంకట రాజశేఖర్, హేమశ్రీ దంపతుల కుమార్తె శ్రీగాయత్రి అమెరికాలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాలో ఉద్యోగి. వీరి తల్లిదండ్రులు సంబంధం కుదుర్చుకొని నగరంలో అంగరంగ వైభవంగా సాయి చైతన్య, శ్రీగాయత్రి పెండ్లి జరపాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు వధూవరులకు.. నగరం నుంచి అమెరికాకు వెళ్లేందుకు వారి తల్లిదండ్రులకు అనుమతి లభించలేదు. దీంతో అనుకున్న ముహూర్తానికే వివాహం జరపాలని ఆ కుటుంబాలు నిశ్చయించుకున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11:17 గంటలకు సాయి చైతన్య, శ్రీగాయత్రిల వివాహం న్యూజెర్సీలోని బ్రిడ్జివాటర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్నది. ఈ వేడుకను నగరంలో వధూవరుల తల్లిదండ్రులు, బంధువులు ఆన్లైన్లో వీక్షించి ఆశీర్వదించనున్నారు.